పిచ్చి ట్వీట్లు చేస్తూ సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు: లోకేష్ పై అంబటి ఫైర్

  • జగన్ లాంటి వ్యక్తిని కించపరచాలని చూస్తావా?
  • లోకేష్ కు సిగ్గు ఉందా?
  • బాబూ కొడుకులిద్దరినీ ఇంటికి పంపించడం ఖాయం
వైసీపీ అధినేత జగన్ ని మంత్రి నారా లోకేశ్ తన వరుస ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ చేసిన ఓ ట్వీట్ గురించి ప్రస్తావించారు.

‘తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ జగన్ ని అభివర్ణించేందుకు లోకేష్ తన ట్వీట్ లో ప్రయత్నం చేశారని అంబటి విమర్శించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచి ప్రజల మధ్యన జగన్ ఎలా తిరుగుతున్నారో, ఎంతగా కష్టపడుతున్నారో తానేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంబటి అన్నారు. లోకేశ్ ఏమీ కష్టపడకుండా వచ్చాడు కదా, తన తండ్రి, తాతల ఆస్తులతో వచ్చిన వ్యక్తే తప్ప, కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాదని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తిని కించపరచాలని చూస్తున్న ‘లోకేష్ కు సిగ్గు ఉందా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘లోకేష్ బాబు.. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. నువ్వు మీ నాన్నగారి చంకలో ఎక్కి కూర్చున్నావు.. నీ గురించి ఇంత మాట్లాడటం కూడా వేస్ట్. నీ పరిస్థితేంటో, నీ జ్ఞానమేంటో మా అందరికీ తెలుసు. ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు చేస్తే నిన్నూ, మీ నాన్నను, బాబూ కొడుకులిద్దరినీ ఇంటికి పంపించే రోజులు దగ్గరున్నాయి. ఒక ఆరునెలలే.. ఎక్కువ కూడా లేదని చెబుతున్నా. ఇలాంటి పిచ్చి ట్వీట్లు చేస్తే ప్రజలు క్షమించరని తండ్రీకొడుకులకు చెప్పదలచుకున్నాను’ అని అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
ambati rambabu
ys jagan

More Telugu News